లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే చేపట్టబోయే అభివృద్ధి పనులు వివరిస్తూ ఓట్లు అడుగుతామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. మొరదాబాద్ జిల్లాలో జరిగిన ప్రతిజ్ఞా ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ అభివృద్ధి అంశంతోనే తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలను యువతకు అందుబాటులోకి తీసుకువస్తామని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తయారీ కంపెనీలతో కూడిన మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మరణించిన రైతుల పట్ల ప్రధాని మోదీకి ఎలాంటి గౌరవం లేదని మండిపడ్డారు. చెరకు రైతుల బకాయిలకు కేవలం రూ 4000 కోట్లు అవసరమవుతాయని, గత ఏడాది కొవిడ్-19 సమయంలో మోదీ రూ 8000 కోట్లతో ప్రైవేట్ విమానం కొనుగోలు చేశారని అన్నారు. పార్లమెంట్ సుందరీకరణకు రూ 20,000 కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వానికి రైతుల బకాయిలు చెల్లించేందుకు మాత్రం డబ్బులు ఉండవని విమర్శించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చ్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలుపుకోవాలని యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, పాలనా పగ్గాలు చేపట్టాలని ఎస్పీ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు యూపీ బరిలో సత్తా చాటాలని బీఎస్పీ, కాంగ్రెస్ తమ ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.