చండీఘఢ్ : పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ యూపీ, బిహార్ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. పంజాబ్ను పంజాబీలే పాలించాలని మాత్రమే చన్నీ అన్నారని ఆమె పేర్కొన్నారు. చన్నీ ప్రకటనను తప్పుగా అర్ధం చేసుకున్నారని యూపీ నుంచి ఏ ఒక్కరూ పంజాబ్కు వచ్చి ఆ రాష్ట్రాన్ని పాలించాలని కోరుకుంటారని తాను అనుకోనని అన్నారు. పంజాబీల బాగు కోసం పనిచేసే సుస్దిర, పటిష్ట ప్రభుత్వం అవసరమని పేర్కొన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టిన సమయంలో ముఖం చూపించని ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో పంజాబ్ పర్యటనలకు వస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం ప్రబలుతున్నా మోదీ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. పంజాబ్లో కాంగ్రెస్ ప్రభంజనం కనిపిస్తోందని ప్రియాంక గాంధీ ధీమా వ్యక్తం చేశారు.
కాగా పంజాబ్ను పాలించేందుకు యూపీ, బిహార్, ఢిల్లీల నుంచి వచ్చే వారిని అనుమతించవద్దని చన్నీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చన్నీ ఈ వ్యాఖ్యలు చేస్తుండగా పక్కనే నిలబడిన పార్టీ నేత ప్రియాంక గాంధీ నవ్వుతూ ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తూ కనిపించారు. ఇక చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ, ఆప్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పంజాబ్ సీఎం చన్నీ యూపీ, బిహార్ ప్రజలను అవమానించారని బీజేపీ ఆక్షేపించింది. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తలపడుతున్న క్రమంలో అక్కడి ప్రజలను ప్రియాంక గాంధీ ఎలా అవమానిస్తారని కాషాయ పార్టీ ప్రశ్నించింది. మరోవైపు చన్నీ వ్యాఖ్యలను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా తప్పుపట్టారు. ఇది చాలా సిగ్గుచేటని, ఏ వ్యక్తి లేదా వర్గాన్ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తాము ఖండిస్తామని స్పష్టం చేశారు.
ప్రియాంక గాంధీ కూడా యూపీకి చెందిన వారని ఆమెకు కూడా ఈ వ్యాఖ్యలు వర్తిస్తాయా అని కేజ్రీవాల్ నిలదీశారు. పంజాబ్ కాంగ్రెస్ చీప్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పక్కనపెట్టి ప్రస్తుత సీఎం, దళిత నేత చన్నీని కాంగ్రెస్ పార్టీ తమ సీఎం అభ్యర్ధిగా ముందుకు తెచ్చింది. పంజాబ్ జనాభాలో 32 శాతం ఉన్న దళితులు చన్నీ నాయకత్వం పట్ల మొగ్గుచూపుతారని వారి ఓట్లతో గద్దెనెక్కాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పంజాబ్లో దళితుల నుంచి తొలి ముఖ్యమంత్రి చన్నీ కావడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 20న ఒకే దశలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా కాంగ్రెస్, ఆప్, ఎస్ఏడీ, బీజేపీ-పీఎల్సీ కూటమిలు ప్రధానంగా తలపడుతున్నాయి.