బెంగళూర్ : బీజేపీ అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని కాషాయ పార్టీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం, పేదరికం వంటి ప్రధాన సమస్యల నుంచి బీజేపీ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని ఆరోపించారు. కర్నాటకలోని బెళగావి జిల్లా ఖానాపూర్లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ప్రియాంక గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ తీరును దుయ్యబట్టారు.
బీజేపీ ప్రభుత్వం తమను లూటీ చేసిందని గుర్తెరిగిన ప్రజలు ప్రస్తుతం మార్పు కోరుతున్నారని అన్నారు. బసవరాజ్ బొమ్మై సారధ్యంలోని కర్నాటక ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కర్నాటకలో పాలక బీజేపీకి భంగపాటు తప్పదని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేయడంతో కాంగ్రెస్, జేడీఎస్లు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి.
కాగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది తిరిగి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన బీజేపీ సర్కార్ను మట్టికరిపించి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పోరాడుతోంది. ఇక గణనీయ సంఖ్యలో సీట్లు, ఓట్లు సాధించి సత్తా చాటేందుకు జేడీఎస్ సర్వసన్నద్ధమైంది. ఇక మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More