న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడం పట్ల బీజేపీ సర్కార్పై ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా విమర్శలు గుప్పించారు. అవసరమైతే తాను రాజకీయాల్లో ప్రవేశిస్తానని ప్రియాంక గాంధీ భర్త వాద్రా సంకేతాలు పంపారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్ధలు ఏ ఒక్క బీజేపీ నేతనైనా ప్రశ్నించేందుకు పిలిచాయా అని ఆయన నిలదీశారు. తమ విధానాలతో దేశంలో అసంతృప్తి పెల్లుబుకుతోందని పసిగట్టిన ప్రతిసారీ పాలక బీజేపీ గాంధీ కుటుంబాన్ని ఇరుకునపెడుతోందని దుయ్యబట్టారు.
దేశంలో పెను మార్పు రావాల్సిన అవసరం ఉందని, దేశంలో అవసరమైన మార్పు తాను తీసుకురాగలనని ప్రజలు భావిస్తే తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని రాబర్ట్ వాద్రా స్పష్టం చేశారు. జీఎస్టీ పట్ల ప్రజల్లో అసంతృప్తి వెల్లువెత్తడంతో సోనియా గాంధీని ఈడీ ప్రశ్నిస్తోందని ఆరోపించారు. ఈరోజుల్లో వ్యాపార వేత్తలకు ఆదాయ పన్ను అధికారుల నుంచి కాకుండా ఈడీ నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. తాను కుటుంబానికి మద్దతుగా ఉంటానని, తాను హాట్ టాపిక్ కాకూడదనే ఈడీ కార్యాలయానికి సోనియా గాంధీతో వెళ్లలేదని చెప్పుకొచ్చారు.
అందరినీ నిర్భందించినప్పుడు అన్యాయం గురించి మాట్లాడేందుకు ఎవరో ఒకరు ఉండాలని అన్నారు. తనను ఇప్పటికి ఈడీ 15 సార్లు ప్రశ్నించిందని, 23,000 డాక్యుమెంట్లను సమర్పించానని అందుకే ఈడీని ఎలా ఎదుర్కోవాలో తాను ఆమెకు (సోనియా గాంధీ) సూచించానని వాద్రా తెలిపారు. మరోవైపు సోనియా గాంధీని ఈడీ విచారిస్తున్న క్రమంలో మోదీ సర్కార్ విపక్ష నేతలపై దర్యాప్తు సంస్ధలను ప్రయోగిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ సర్కార్ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన ర్యాలీలు చేపట్టాయి.