న్యూఢిల్లీ, నవంబర్ 29: దేశంలోని విద్యుత్తు సంస్థలు, డిస్కంలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రైవేటీకరణతో తీరిపోయేవి కావని ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ అన్నారు. మంగళవారం కేపీఎంజీ నిర్వహించిన ‘ఎన్రిచ్ 2022’ చర్చలో పాల్గొన్న ఆయన.. ‘ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలోని డిస్కంలు లాభాలు గడిస్తున్నాయి. అదే సమయంలో రాష్ర్టాల ఆధ్వర్యంలోని చాలా డిస్కంలు సమర్థంగా పనిచేస్తున్నాయి, గణనీయ లాభాలు గడిస్తున్నాయి. డిస్కంల సమస్యలకు ప్రైవేటీకరణ ఒక్కటే పరిష్కారం కాదు’ అని తెలిపారు. పునరుత్పాదక విద్యుత్తు వినియోగంపై మాట్లాడుతూ శిలాజేతర ఇంధన విద్యుత్తు ఉత్పత్తి కోసం ఎన్టీపీసీ చేయాల్సిందల్లా చేస్తున్నదని వెల్లడించారు. పునరుత్పాదక విద్యుత్తు వైపు ఎన్టీపీసీ మళ్లుతున్నదని, అదే సమయంలో జాతీయ వినియోగాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నామని వివరించారు. ఉన్నదాంట్లో, సరసమైన ధరకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అయితే, బొగ్గు ప్లాంట్లను మూసేస్తున్నట్టు కాదని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం దేశానికి కావాల్సిన విద్యుత్తులో పావలా వంతు ఎన్టీపీసీ నుంచే అందుతున్నదని పేర్కొన్నారు.