ముంబై, మే 3: కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రింట్ మీడియాను అధిక న్యూస్ప్రింట్ ధరలు దెబ్బతీస్తూనే ఉన్నాయి. ప్రకటనల ద్వారా ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) 25 శాతం వరకు పెరగవచ్చని ఓ తాజా రిపోర్టు అంచనా వేసింది. అయినప్పటికీ న్యూస్ప్రింట్ అధిక ధరల కారణంగా లాభాలు కూడా పెరుగుతాయని అనుకోవద్దంటూ సదరు నివేదిక స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెరిగిన న్యూస్ప్రింట్ ధరలు.. వార్తా పత్రికల లాభాల్ని మింగేస్తున్నాయని మంగళవారం ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ పేర్కొన్నది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3 శాతం వరకు ప్రింట్ మీడియా సంస్థల లాభాలు తగ్గిపోవచ్చన్నది.
కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా వార్తా పత్రికల సర్క్యులేషన్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో 2020-21లో సుమారు సగానికి న్యూస్ప్రింట్ అవసరాలు తగ్గిపోయాయి. 1.1 మిలియన్ టన్నులకే పరిమితమైనట్టు తాజా నివేదిక చెప్తున్నది. అయితే గత ఆర్థిక సంవత్సరం (2021-22) కొంత మెరుగైన సంకేతాలున్నాయన్నది. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరం న్యూస్ప్రింట్కు మరింతగా డిమాండ్ ఉండవచ్చని అంటున్నది. ప్రకటనల ద్వారా ఆదాయం 25 శాతం పెరగవచ్చని, అయితే అధిక ధరలతో లాభాల్లో క్షీణత తప్పదని అంచనా వేస్తున్నది. ప్రింట్ మీడియా సంస్థల ఆదాయంలో మూడింటా రెండు వంతులు ప్రకటనల ద్వారానే వస్తుంది. మిగతా ఒక వంతు ఆదాయం సర్క్యులేషన్, ఇతరత్రా వనరుల ద్వారా సమకూరుతుంది. దీంతో మార్కెట్లో వ్యాపారాలు బాగుంటేనే ప్రింట్ మీడియాకు లాభమని ఇండియా రేటింగ్స్ అన్నది. కాగా, కరోనాకు ముందు 2019-20లో న్యూస్ప్రింట్ డిమాండ్ 2.1 మిలియన్ టన్నులుగా ఉన్నది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పడిపోతున్న దిగుమతుల మధ్య దేశీయ వనరులపైనే పరిశ్రమ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో క్రమేణా స్థానికంగా న్యూస్ప్రింట్ ఉత్పత్తి పెరుగుతుండటం ఒకింత ఊరటగా చెప్పుకోవచ్చు. దీనివల్ల ధరల పెరుగుదలకూ చెక్ పడుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి నిరుడు ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు దేశీయ న్యూస్ప్రింట్ వినియోగంలో దిగుమతుల వాటా సుమారు 52 శాతంగానే ఉన్నది. ఇది గడిచిన దశాబ్దకాలంలోనే కనిష్ఠం కావడం విశేషం.