దుబాయ్: ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన కాప్28 సదస్సు (వాతావరణ మార్పుల సదస్సు) కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సదస్సులో ప్రసంగిస్తూ 2028లో జరగాల్సిన కాప్33 సదస్సును భారత్లో నిర్వహిస్తామని ప్రధాని ప్రతిపాదించారు.
ప్రపంచ జనభాలో భారతదేశపు జనాభా 17 శాతం ఉన్నదని, కానీ ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో భారత్ నుంచి విడుదలయ్యేది కేవలం 4 శాతమే అని ప్రధాని చెప్పారు. నేషనల్లీ డిటర్మైండ్ కంట్రిబ్యూషన్ (NDC) లక్ష్యాల సాధన దిశగా తాము వేగంగా కదులుతున్నామని తెలిపారు. ఇతర దేశాలు కూడా కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించుకోవాలని కోరారు.