చండీగఢ్: ప్రధాని నరేంద్రమోదీ రేపు పంజాబ్లో పర్యటించనున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని అక్కడికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఫిరోజ్పూర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు. కాగా, వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దుచేసిన తర్వాత ప్రధాని మోదీ పంజాబ్లో పర్యటించడం ఇదే తొలిసారి.
కాగా, ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పంజాబ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రచార సారథి గజేంద్రసింగ్ షెకావత్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రాణా గుర్మీత్ సోధీ, ఇతర నేతల బృందం కూడా ఏర్పాట్లను పూర్తిచేయడం కోసం ప్రధాని పర్యటనకు ముందే అక్కడికి చేరుకుంది.
ప్రధాని సభ జరుగనున్న ఫిరోజ్పూర్ జనాభాలో దాదాపు 70 శాతం మంది హిందువులే ఉన్నారు. దాంతో ఆ పట్టణం మొత్తం ప్రధాని పోస్టర్లు వెలిశాయి. ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం కూడా మొత్తం కాషాయం, ఆకుపచ్చ రంగు బ్యానర్లతో నిండిపోయింది. కాగా, ప్రధాని మోదీ రేపు విమానంలో భటిండాకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్లో ఫిరోజ్పూర్కు వస్తారు.
అనంతరం హుస్సేనీవాలా సరిహద్దుల్లోని జాతీయ అమరువీరుల స్మారకం వద్దకు ప్రధాని చేరుకోనున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులైన భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ సమాధుల వద్ద ఆయన నివాళులర్పించనున్నారు. కాగా ప్రధాని మోదీ 2015లో అక్కడ పర్యటించినప్పుడు కూడా అమరవీరులకు నివాళులర్పించారు.