న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రధాని నరేంద్రమోదీ, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో సైనిక బలగాల విన్యాసాలు, వివిధ రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల శకటాల ప్రదర్శన ఆహుతులను మంత్ర ముగ్దులను చేసింది.
అయితే, ఈ గణతంత్ర వేడుకల్లో మోడీ వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలకు మోదీ.. తలకు తలపాగా ధరించి సంప్రదాయ వస్త్రధారణలో రావడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే, ఈ గణతంత్ర వేడుకల్లో మోదీ తలపాగాకు స్వస్తి చెప్పారు. అందుకు బదులుగా బ్రహ్మకమలం చిత్రంతో ఉన్న ఉత్తరాఖండ్ సంప్రదాయ టోపీని ధరించారు.
మోదీ కేదార్నాథ్కు వెళ్లినప్పుడల్లా ఇలా బ్రహ్మకమలంతో ఉన్న టోపీని ధరిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఈసారి ప్రధాని తన మెడపై వేసుకున్న కండువా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మణిపూర్ సంప్రదాయానికి సంబంధించిన కండువాను ఆయన ధరించారు. అయితే, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓట్ల కోసం ఆయన ఇవాళ ఆయా రాష్ట్రాల సంప్రదాయ వస్త్రాలను ధరించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.