తిరువనంతపురం: స్వేచ్ఛా ఏక కణ జీవి అమీబా కారణంగా అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన కేరళలోని అలప్పుజ జిల్లాలో జరిగింది. పనవళ్లికి చెందిన 15 ఏండ్ల బాలుడు ఓ వాగులోని కలుషిత నీటిలో ఈతకొట్టాడు. కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం నుంచి స్థానిక దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతిచెందాడు. ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్సెఫాలిటిస్ (పీఏఎం) అనే అరుదైన మెదడు సంబంధ వ్యాధితోనే ఆ బాలుడు కన్నుమూశాడని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
గతంలోనూ రాష్ట్రంలో ఇలాంటి కేసులు నమోదైనట్టు చెప్పారు. తొలిసారిగా 2016లో అలప్పుజలో ఈ కేసు వెలుగు చూసిందని, అనంతరం 2019, 2020లో మలప్పురం, 2020,2022లో కోజికోడ్లో ఈ కేసులు నమోదయ్యాయని తెలిపారు. జ్వరం, తలనొప్పి, వాంతులు, మూర్ఛ ఈ వ్యాధి లక్షణాలని, దీని బారినపడ్డవారంతా చనిపోయారని మంత్రి వెల్లడించారు. దీని మరణాల రేటు వందశాతమని తెలిపారు. కలుషిత నీటిలో ఉండే అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి, బ్రెయిన్ ఇన్ఫెక్షన్కు కారణమవుతున్నట్టు వైద్యులు పేర్కొన్నారు. కలుషిత నీటితో స్నానం చేయవద్దని ప్రజలను హెచ్చరించారు.
నెగ్లేరియా ఫౌలేరి అనే ఏక కణ అమీబా వల్ల కలిగే అరుదైన, తీవ్రమైన వ్యాధి ఇది.
సహజంగా శుద్ధి చేయని, కలుషిత నీటిలో ఉంటుంది. 25 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో ఇది జీవిస్తుంది.
కలుషిత నీటిలో స్నానం చేసినప్పుడు, స్విమ్మింగ్ పూల్స్లో డైవ్ చేసినప్పుడు ఈ అమీబా ముక్కుద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. నేరుగా మెదడుకు చేరుకొని, కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది.
పీఏఎంకు గురైన వ్యక్తిలో తీవ్ర జ్వరం, తలనొప్పి, గొంతు మంట, నిద్రమత్తు, వికారం, వాంతులు, మూర్ఛలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మొదట వాసన, రుచి కోల్పోతారు.
యాంటీ ఫంగల్ మందులు వాడినా ఈ ఇన్ఫెక్షన్ సోకిన పది రోజుల్లోనే చాలామంది మృత్యువాతపడ్డారు.
ఈ పీఏఎం కేసు మొదటిసారి 1960లో దక్షిణ ఆస్ట్రేలియాలో వెలుగుచూసింది. అనంతరం క్వీన్స్లాండ్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అమెరికాలో 12 ఏండ్లలోపు పిల్లలే ఎక్కువగా ఈ వ్యాధిబారినపడ్డారు. మనదేశంలో కేరళలోనే ఆరు కేసులు నమోదవ్వగా.. అందరూ ప్రాణాలు కోల్పోయారు.
నివారణ, చికిత్స