న్యూఢిల్లీ, జూన్ 1: కేంద్రం మరోసారి సామాన్యులపై గ్యాస్ పిడుగు వేసింది. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాటరింగ్ వ్యాపారాలపై అదనపు భారం వేస్తూ జూన్ 1 నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 53.50 పెరిగింది. నెల ప్రారంభంలో జరుగుతున్న మార్పుల పరంపరలో భాగంగా ఈ ధరల సవరణ అమల్లోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 3,071.50 నుంచి రూ. 3,113.50కి చేరుకుంది. దేశంలోనే అత్యధికంగా కోల్కతాలో వాణిజ్య ఎల్పీజీ ధర రూ.53.50 పెరుగగా, ముంబైలో రూ.43.50, చెన్నైలో రూ.46 చొప్పున పెరిగింది. తాజా పెంపుతో ఆహార, క్యాటరింగ్ సర్వీసుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ పరిశీలకులు తెలిపారు. పెరిగిన ఇంధన ధరలను వాణిజ్య సంస్థలు వినియోగదారులకు బదిలీ చేస్తున్నందున రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసులు మరింత భారం కానున్నాయి.
5 కిలోల ఎఫ్టీఎల్ పెంపు
చోటా సిలిండర్గా ప్రజాదరణ పొందిన 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ(ఎఫ్టీఎల్) సిలిండర్ ధర కూడా రూ.11 పెరిగింది. పెంపుతో ఈ సిలిండర్ ధర రూ.821.50కి చేరుకుంది. ఎఫ్టీఎల్ సిలిండర్ను సాధారణంగా వలస కార్మికులు, విద్యార్థులు, చిన్న దుకాణదారులు ఉపయోగిస్తారు. దీని కొనుగోలుకు అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకపోవడమే ఇందుకు కారణం.
ఏటీఎఫ్ ధరల కోత
అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్(ఏటీఎఫ్) ధరలను 27 శాతం తగ్గిస్తూ నెలవారీ సమీక్షలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఇంధన ప్రమాణాలు సడలించడంతో విమానయాన సంస్థలకు ఉపశమనం లభించింది. అయితే దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ రేట్లు వరుసగా రెండో నెల కూడా యథాతథంగా ఉన్నాయి.