Onion Price | న్యూఢిల్లీ, అక్టోబర్ 27: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి ధరల మోతతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. పేద, మధ్యతరగతి ప్రజలపై నిత్యం ఏదోక నిత్యావసర వస్తువుల ధరల బండ పడుతూనే ఉన్నది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరాఘాతంలో దేశంలోని ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు పెరిగిన నిత్యావసరాల ధరలతో కడుపు నిండా తినే పరిస్థితి కూడా లేదు. నూనెలు, పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యుడి కొనుగోలు శక్తి క్షీణించింది. ఈ మధ్య వరకు టమోటా ధరల ‘మోత’ మోగగా, ఇప్పుడు ఉల్లిగడ్డల వంతు వచ్చింది. కొనకుండానే, కోయకుండానే వినియోగదారుల కండ్లలో ఉల్లి నీళ్లు తెప్పిస్తున్నది. దేశంలో ఉల్లిపాయల ధరలు ప్రస్తుతం ఆకాశన్నంటాయి.
నెల రోజుల వ్యవధిలో ఉల్లి ధర దాదాపు రెట్టింపు అయింది. దేశవ్యాప్తంగా సగటు రిటైల్ ఉల్లి ధర 57 శాతం పెరిగింది. ఏడాది క్రితం రూ.30గా ఉన్న సగటు కిలో ఉల్లి ధర శుక్రవారం రూ.47కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే గత వారం వరకు రూ.35-40 పలికిన ఉల్లి ప్రస్తుతం రూ.50-80కి చేరిందని వినియోగదారులు చెబుతున్నారు. గత వారం కిలో ఉల్లి రూ.40కు కొన్న తాను ఇప్పుడు రూ.80 కొనాల్సి వచ్చిందని నోయిడాకు చెందిన శేఖర్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి పంట అత్యధికంగా పండించే మహారాష్ట్రలోని నాసిక్లో కిలో ఉల్లి రూ.25 నుంచి రూ.50-60కి పెరిగింది. ఒడిశాలోని భువనేశ్వర్లో కొన్ని మార్కెట్లలో ధర రూ.80 వరకూ ఉన్నది. ఖరీఫ్ పంట ఉత్పత్తి ఆలస్యం నేపథ్యంలో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని, డిసెంబర్ చివరి వరకు ధరల మంట ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ధరలను నియంత్రించే పేరుతో కేంద్ర ప్రభుత్వం బియ్యం, గోధుమలు, చక్కెర తదితరాల ఎగుమతులపై నిషేధం, ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి దేశంలో నెలకొన్నది.
పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో ఒక సామాన్యుడి కుటుంబ వ్యయం తడిసి మోపెడవుతున్నది. అంచనాలకు అందని విధంగా ధరాఘాతంలో వారి బతుకులు అతలాకుతలం అవుతున్నాయి. ఇంట్లో వినియోగించే ప్రతి వస్తువు ధర పెరిగిన కారణంగా ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అనే విధంగా సామాన్యుడి పరిస్థితి తయారైంది. ఓవైపు ధరలు పెరుగుతున్నా సామాన్యుడి ఆదాయం మాత్రం పెరుగడం లేదు. కుటుంబానికి వస్తున్న నెలవారీ ఆదాయానికి, ధరల పెరుగుదల కారణంగా అవుతున్న ఖర్చుకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు రూ.71, రూ.55గా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మోదీ పాలనలో ఏకంగా సెంచరీ కొట్టేశాయి. 2014 నుంచి ఇప్పటి దాకా మోదీ సర్కార్ డీజిల్పై 512 శాతం, పెట్రోల్పై 194 శాతం చొప్పున ఎక్సైజ్ పన్నులను పెంచింది. దీంతో ఉత్పాదక ఖర్చులు, రవాణా చార్జీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి ఆ ప్రభావం నిత్యావసర సరుకులపై పడిందనేది ఆర్థిక రంగ నిపుణుల విశ్లేషణ. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ మోదీ సర్కార్ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా అదే భారాన్ని కొనసాగిస్తున్నది. క్రూడాయిల్ ధరల తగ్గుదల లబ్ధిని సామాన్యుడికి చేరనీయకుండా.. ఆ లాభాలను తన ఖజానాకు మళ్లించుకొంటున్నది.
వంట గ్యాస్ సిలిండర్ ధరలను రూ.400 నుంచి ఏకంగా దాదాపు మూడు రెట్లు పెంచి.. పేద, మధ్యతరగతి ఇంట్లో పొగ పెట్టింది. అధిక ధరల కారణంగా చాలా కుటుంబాలు తమ ఇండ్లలోని ఎల్పీజీ సిలిండర్లను మూలన పెట్టేసి తిరిగి కట్టెల పొయ్యి వైపునకు మళ్లాయి. అయితే ఈ క్రమంలో సరిగ్గా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిలిండర్ ధరను కొంత మేర తగ్గించి.. కమలం పార్టీ తన ఎన్నికల నైజాన్ని బయటపెట్టుకొనదనే విమర్శలు పెద్దయెత్తున వచ్చాయి.