Rahul Gandhi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 24, (నమస్తే తెలంగాణ): రాహుల్ గాంధీ పరువునష్టం కేసు అనేక మలుపులు తిరిగింది. 2019నాటి కర్ణాటక ఎన్నికల సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువునష్టం దావా వేశారు. అయితే హైకోర్టులో ఆ కేసు విచారణ చాలారోజులుగా పెండింగ్లో ఉన్నది. ఈ క్రమంలో లోక్సభలో అదానీ అంశంపై విపక్ష నేత రాహుల్గాంధీ ఫిబ్రవరి 7న మోదీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. మోదీ-అదానీ బంధాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాతే బీజేపీ తన వ్యూహాలకు పదును పెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టులో కేసును ఉపసంహరించుకున్న పిటిషన్దారు సూరత్కోర్టును తిరిగి ఆశ్రయించడంతో.. ఫిబ్రవరి 27న ఈ కేసులో విచారణ ప్రారంభమైంది. మార్చి 17న విచారణ ముగించి, తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం.. 23న రాహుల్కు శిక్షను ఖరారు చేసింది. కేవలం 24 రోజుల్లో విచారణ పూర్తిచేసి శిక్ష ఖరారు చేయడం గమనార్హం.
ఏప్రిల్ 13, 2019 : సార్వత్రిక ఎన్నికల సమయంలో కర్నాటకలోని కోలార్లో ర్యాలీలో పాల్గొన్న రాహుల్.. మోదీ ఇంటిపేరును ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.
ఏప్రిల్ 16,2019 : రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు రాహుల్పై ఐపీసీ సెక్షన్ 499, 500, 504 కింద అభియోగాలు నమోదయ్యాయి.
మే 2, 2019: రాహుల్ గాంధీపై కేసు రిజిష్టర్ చేస్తూ న్యాయమూర్తి సమన్లు పంపారు.
అక్టోబర్ 10, 2019: కోర్టు విచారణకు రాహుల్ హాజరయ్యారు. తనపై ఆరోపణల్ని కొట్టేయాలని న్యాయమూర్తిని కోరారు.
జూన్, 2020: తానెప్పుడూ అలాంటి ఆరోపణలు చేయలేదని రాహుల్ కోర్టుకు తెలిపారు.
అక్టోబర్ 29, 2021: వాంగ్మూలం రికార్డు చేయటం కోసం తమ ముందుకు రావాలని కోర్టు ఆదేశం
మార్చి 17, 2023 : సూరత్ కోర్టులో ముగిసిన వాదోపవాదాలు. తీర్పు రిజర్వ్.
మార్చి 23, 2023: పరువునష్టం కేసులో రాహుల్ను దోషిగా తేల్చిన సూరత్ కోర్టు. రెండేండ్లు జైలుశిక్ష ఖరారు. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే వెసులుబాటు ఇస్తూ తీర్పు.
మొహమ్మద్ ఫైజల్: లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్ను అక్కడి సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. ఓ హత్యాయత్నం కేసులో ఈ తీర్పు వెలువరించింది. దీంతో గత జనవరిలో ఎంపీగా ఆయన అనర్హత వేటుకు గురయ్యారు. అయితే, కేరళ హైకోర్టు స్టే విధించడంతో మళ్లీ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని న్యాయశాఖ సిఫారసు చేసింది.
లాలూ ప్రసాద్ యాదవ్: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా 2013లో లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.
ఆజంఖాన్: 2019లో చేసిన ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఎస్పీ నేత ఆజంఖాన్ను కోర్టు దోషిగా తేల్చింది. దీంతో యూపీ అసెంబ్లీ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది.
జయలలిత: తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలిత కూడా జైలు శిక్ష కారణంగా అనర్హతకు గురయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేండ్ల జైలుశిక్షతోపాటు సీఎం పదవి కూడా కోల్పోయారు. అనంతరం 2015లో హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. దీంతో మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇందిరాగాంధీ: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వటంతో 1975లో ఆమె పార్లమెంట్ సభ్యత్వంపై వేటు పడింది. ఆ తర్వాత 1978 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఘోర ఓటమిని చవిచూశారు.
సోనియాగాంధీ: రాయ్బరేలీ ఎంపీగా ఉన్న సోనియాగాంధీ ‘నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్’ ఛైర్మన్గా ఉన్నారంటూ ఆరోపణలు వచ్చాయి. దాంతో 2006లో ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరికొందరు.. జేడీయూ నేత జగదీశ్ శర్మ, కాంగ్రెస్ ఎంపీ రషీద్ మసూద్, ఎమ్మెల్యే ఎనస్ ఎక్కా, విక్రమ్సింగ్ తదితరులు కూడా అనర్హతకు గురయ్యారు.