న్యూఢిల్లీ, మే 24: వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. 18-44 ఏండ్ల మధ్య వయసు గలవారు.. ముందస్తు పేరు నమోదు లేకుండానే టీకా కేంద్రాల వద్ద (ఆన్సైట్ లేదా స్పాట్) రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ పొందొచ్చని సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికోసం ‘కొవిన్’ పోర్టల్లో మార్పులు చేసింది. ఈ సడలింపు ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలకే వర్తిస్తుందని, ప్రైవేట్ టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్ వేసుకోవాలంటే ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరని స్పష్టం చేసింది. అయితే, ‘ఆన్సైట్’ రిజిస్ట్రేషన్పై తుది నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలదేనని తెలిపింది. వ్యాక్సిన్ షెడ్యూల్స్, స్లాట్ల వివరాలను ప్రైవేట్ టీకా కేంద్రాలు ఆన్లైన్లో చూపించాలని ఆదేశించింది.
రద్దీ లేకుండా చూసుకోండి!
టీకా వృథాను తగ్గించేందుకే 18-44 ఏండ్ల వయసువారికి ఆన్సైట్ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించినట్టు కేంద్రం తెలిపింది. ‘వ్యాక్సిన్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్నవారు.. ఒకవేళ ఆ సమయానికి టీకా కేంద్రానికి రాకపోతే ఆ రోజు టీకా డోసులు నిరుపయోగంగా మారుతున్నాయి. టీకా వృథాను కొంతలో కొంత తగ్గించేందుకే 18-44 ఏండ్ల వారికి ఆన్సైట్ రిజిస్ట్రేషన్కు అనుమతించాం’ అని ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల విజ్ఞప్తుల మేరకే ఈ ఆన్సైట్ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించినట్టు వివరించింది. ఇంటర్నెట్ లేనివారికి, మొబైల్ ఫోన్స్ వాడకం తెలియనివారికి ఇది సాయపడుతుందని అధికారులు తెలిపారు. ఆన్సైట్ రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి రద్దీ నెలకొనకుండా చూసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది.