Punjab | చండీగఢ్: గత కొన్నేండ్లుగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయితీ నిత్యకృత్యంగా మారింది. తాజాగా పంజాబ్లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. తాను పంపిన లేఖలకు సీఎం మాన్ సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్.. రాష్ట్రపతి పాలన పెట్టిస్తానని, ఈ మేరకు రాష్ట్రపతికి సిఫార్సులు చేస్తానని హెచ్చరించారు.
ఈ విధమైన హెచ్చరికతో కూడిన లేఖను గవర్నర్ తాజాగా డైరెక్ట్గా సీఎం భగవంత్మాన్కే రాయడం గమనార్హం. తన లేఖలకు సమాధానం ఇవ్వకుంటే ఐపీసీలోని సెక్షన్ 124 కింద క్రిమినల్ చర్యలు కూడా తీసుకొంటానని అందులో పేర్కొన్నారు. ఈ లేఖను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. తాను గతంలో రాసిన లేఖలకు మీరు(సీఎం మాన్) సమాధానం ఇవ్వకపోవడం పట్ల చాలా కలత చెందానని గవర్నర్ తన తాజా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని పేర్కొంటూ రాష్ట్రపతికి నివేదిక పంపిస్తానని హెచ్చరించారు. శిక్షణ నిమిత్తం 36 మంది పాఠశాలల ప్రిన్సిపాల్స్ను విదేశాలకు పంపడంతో పాటు పలు ఇతర అంశాలపై తాను గతంలో రాసిన లేఖ ద్వారా సమాచారం కోరానని, అదేవిధంగా రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం సమస్యను నివారించేందుకు తీసుకొన్న చర్యలపై వివరాలు కోరానని గవర్నర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగా సమాధానం నిరాకరిస్తున్నట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు.
పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు సిఫార్సు చేస్తానంటూ గవర్నర్ పురోహిత్ బెదిరింపులకు దిగడంపై అధికార ఆమ్ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. పంజాబ్కు బదులు మణిపూర్, హర్యానాలో రాష్ట్రపతి పాలన విధిస్తే బాగుంటుందని స్పష్టంచేసింది. రాజ్యాంగ పరిధిలోనే ఆప్ సర్కారు పనిచేస్తున్నదని ఆ పార్టీ అధికార ప్రతినిధి మల్విందర్ సింగ్ కాంగ్ పేర్కొన్నారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ఒకవేళ రాష్ట్రపతి పాలన విధించాలనుంటే అల్లర్లతో అట్టుడుకుతున్న బీజేపీ పాలిత రాష్ర్టాలు మణిపూర్, హర్యానాలో విధించాలని స్పష్టంచేశారు.