న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కలకలం రేపినా దేశ ప్రజలు ఒక్కటిగా నిలిచి ఐక్యత చాటారని రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ అన్నారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుచేసుకుంటూ వారి సేవలను ఆయన కొనియాడారు. భారతీయులంతా ఒక కుటుంబంలా ఎలా ఒక్కటిగా నిలిచారని కొవిడ్ సంక్షోభం ప్రపంచానికి చాటిందని చెప్పారు.
ఒకరిపై మరొకరు ఎలా ఆధారపడి ఉన్నామనే విషయాన్ని ఈ సంక్షోభంతో మనం గుర్తెరిగామని అన్నారు. కొవిడ్-19 మహమ్మారి నీడన వేడుకలు జరుపుకుంటున్నా గణతంత్ర ఘన స్ఫూర్తి మాత్రం ప్రతి ఏడాదిలానే మనలో నిలిచిఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. కరోనాపై దేశ ప్రజలు సమైక్య స్ఫూర్తితో పోరాడిన తీరును ఆయన ప్రశంసించారు. కరోనా వైరస్ కట్టడిలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, మార్గదర్శకాలను విధిగా పాటించాలని కోరారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను కొనసాగించాలని కోరారు.
స్వచ్ఛభారత్ అభియాన్, కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియలను దేశ పౌరులు ప్రజా ఉద్యమంగా మార్చారని కొనియాడారు. పౌరుల నిబద్ధతతోనే ఈ కార్యక్రమాలు ఫలవంతమయ్యాయని అన్నారు. ఇదే అంకితభావంతో జాతి ప్రయోజనాలతో ముడిపడిన కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలవాలని రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ కోరారు.