పుట్టపర్తి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి రానున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ అరుణ్బాబు వెల్లడించారు. రాష్ట్రపతి మధ్యాహ్నం ఒడిశాలో బయలుదేరి 2.35 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 2.45 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుంటారు.
మధ్యాహ్నం 3.05 గంటలకు సాయి కుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహాసమాధిని రాష్ట్రపతి దర్శించుకుంటారు. అనంతరం సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 3.35 గంటలకు స్నాతకోత్సవంలో భాగంగా 21 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఆ తర్వాత సాయంత్రం 4.20 గంటలకు రోడ్డు మార్గాన సత్యసాయి విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. కాగా సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్లో ప్రతి ఏడాది సత్యసాయి బాబా పుట్టినరోజుకు ఒక రోజు ముందు స్నాతకోత్సవం జరుగుతుంది. సత్యసాయి 98వ జయంతికి ముందురోజైన ఇవాళ 42వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నారు.