న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల హర్యానాలో ఓ ఆవుదూడను చూడటానికి వెళ్లారు. ఆ ఆవుదూడ తల, ఒళ్లు నిమురుతూ కాసేపు అక్కడే గడిపారు. దేశంలో చాలా ఆవుదూడలుంటాయి కదా.. రాష్ట్రపతి ముర్ము కేవలం ఆ ఆవుదూడకు మాత్రమే ఎందుకు ప్రాధాన్యం ఇచ్చారనే కదా మీ సందేహం. ఎందుకంటే మిగతా ఆవుదూడల కంటే ఆ ఆవు దూడ చాలా భిన్నమైనది. అన్ని ఆవు లేగల్లా దానిది సహజ జననం కాదు. శాస్త్రవేత్తలు క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఆ ఆవులేగను సృష్టించారు.
శాస్త్రవేత్తలు దేశంలోనే మొదటిసారిగా ఒక గిర్ జాతి ఆవుదూడను క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించారు. హర్యానాలోని నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NDRI)లో ఈ ఏడాది మార్చి 16న ఈ గిర్ జాతి ఆవుదూడ జన్మించింది. ఈ క్లోనింగ్ ఆవుదూడ పుట్టినప్పుడే 32 కిలోల బరువు ఉంది. సాధారణంగా ఈ గిర్ జాతి ఆవులు శ్రేష్ఠమైన పాలు ఇస్తాయి. ఆ పాల నాణ్యతను, దిగుబడిని మరింత పెంచడమే లక్ష్యంగా కొత్త లక్షణాలను చొప్పిస్తూ క్లోనింగ్ లేగదూడను సృస్టించారు.
కాగా, NDRI గతంలో కూడా పలు పరిశోధనలు చేసింది. 2009లో ప్రపంచంలోనే తొలి బర్రె దూడను సృష్టించిన ఘనత కూడా NDRI పేరిట ఉన్నది. కాగా NDRI తాజాగా సృష్టించిన ఈ క్లోనింగ్ ఆవుదూడకు శాస్త్రవేత్తలు గంగ అని పేరుపెట్టారు. గంగకు అంత ప్రత్యేకత ఉన్నది కాబట్టే రాష్ట్రపతి ముర్ము ప్రత్యేకించి ఆ లేగ దూడను చూడటానికి NDRIకి వెళ్లారు.