న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ( Ramnath Kovind ) మన దేశానికి కొత్తగా వచ్చిన నాలుగు దేశాల దౌత్యవేత్తలతో బుధవారం వర్చువల్ పద్ధతిలో సమావేశమయ్యారు. హోలీ సీ, నైజీరియా ఫెడరల్ రిపబ్లిక్, ఆస్ట్రియా రిపబ్లిక్, కొరియా రిపబ్లిక్ దౌత్యవేత్తల నుంచి అధికార పత్రాలు స్వీకరించి, వారికి అభినందనలు తెలిపారు. భారత్లో వారి పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆ నాలుగు దేశాలతో భారత్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.
భారత్తోపాటు ఈ నాలుగు దేశాల ఉమ్మడి లక్ష్యం శాంతి, సౌభాగ్యాలేనని రాష్ట్రపతి పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి సహా ఇతర అంతర్జాతీయ వేదికలపై భారత్ నిర్వహించే కార్యకలాపాల ఫలితంగా పరస్పర ప్రయోజనకర భాగస్వామ్యాలు ఏర్పడుతున్నాయని రాష్ట్రపతి తెలిపారు. న్యాయమైన, సమానత్వంగల అంతర్జాతీయ పరిస్థితులకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా నాలుగు దేశాల దౌత్యవేత్తలు రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు.