హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో సోమవారం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. 2020 ఏడాదికి గాను 141 మందికి పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం ప్రదానం చేశారు. ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేశారు. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పద్మభూషణ్, తెలంగాణ రైతు చింతల వెంకట్రెడ్డి, తెలంగాణ సంస్కృత వాచస్పతిగా పేరొందిన శ్రీభాష్యం విజయసారథి, ఏపీలోని అనంతపూర్కు చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు దళవాయి చలపతిరావు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాటకరంగ కళాకారుడు యడ్ల గోపాలరావు పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. 2021కి గాను 119 మంది మంగళవారం అవార్డులు అందుకోనున్నారు. తెలంగాణ గిరిజన నృత్య కళాకారుడు గుస్సాడీ కనకరాజుతో పాటు ఏపీ నుంచి అన్నవరపు రామస్వామి(కళలు), ప్రకాశ్రావు (సాహిత్యం, విద్య), నిడదవోలు సుమతి (కళలు) పద్మశ్రీలు అందుకోనున్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (మరణానంతరం) తరఫున ఆయన కుటుంబ సభ్యులు పద్మవిభూషణ్ను అందుకోనున్నారు.