న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ ఆశయాలు, త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తాయని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. తన అసాధారణమైన దేశభక్తితో, అద్భుతమైన ప్రసంగంతో యువతను సంఘటితం చేసి పరాయి పాలనకు పునాది వేశాడని అమిత్ షా వ్యాఖ్యానించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారతదేశం ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా నివాళులర్పించిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. భారతదేశానికి స్వేచ్ఛకల్పించడానికి తీసుకున్న సాహసోపేతమైన చర్యలు ఆయనను జాతీయ చిహ్నంగా నిలిపాయన్నారు. నేతాజీ ఆశయాలు, త్యాగాలు ప్రతి భారతీయుడికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని చెప్పారు.
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు నమస్కరిస్తున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తన అసాధారణమైన దేశభక్తితో, ఎనలేని ధైర్యం, అద్భుతమైన ప్రసంగంతో యువతను సంఘటితం చేసి పరాయి పాలనకు పునాది వేసాడని చెప్పారు. మాతృభూమి కోసం ఆయన చేసిన అసమాన త్యాగం, పట్టుదల, పోరాటం దేశానికి ఎల్లవేళలా మార్గదర్శకమని తెలిపారు.