CJI Chandrachud | న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: కేంద్ర దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక సూచనలు చేశారు. గత కొన్నేండ్లుగా సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలు అనేక రకాల కేసుల్లో భాగమవుతుండటాన్ని ప్రస్తావించిన సీజేఐ.. కేసుల ఎంపికలో శ్రద్ధ వహించాలని, తద్వారా దర్యాప్తు సంస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచొచ్చని చెప్పారు. ప్రధానంగా జాతీయ భద్రత, దేశ ఆర్థిక వ్యవస్థకు, శాంతి భద్రతలకు ముప్పు కలిగించే నేరాలపైనే దృష్టిసారించాలని సూచించారు. సీబీఐ రైజింగ్ డే సందర్భంగా డీపీ కోహ్లీ 20వ స్మారక కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సాంకేతికత నేరాలను ఏవిధంగా మార్చింది.. దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు క్లిష్టమైన సవాళ్లపై ఆయన మాట్లాడారు. అనినీతి వ్యతిరేక దర్యాప్తు సంస్థ అయిన సీబీఐని దాని పరిధిని మించి వివిధ క్రిమినల్ కేసులను దర్యాప్తు చేయాలని కోరుతున్నారని, ఇది ఆ సంస్థపై మోయలేని భారాన్ని మోపుతున్నదని పేర్కొన్నారు. సీబీఐ ఎక్కువగా డిప్యుటేషన్ ఉద్యోగులపైనే ఆధారపడుతుంటాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు కేసుల ఎంపికపై దృష్టిపెట్టాలని, దేశ భద్రతకు ముప్పు కలిగించే, దేశానికి వ్యతిరేకంగా జరిగే ఆర్థిక నేరాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
న్యాయవ్యవస్థ ఆధునీకరణలో కీలక ముందడుగు..
సోదాలు చేసేందుకు, పరికరాల స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు సంస్థలకు ఉండే అధికారాలు, వ్యక్తుల గోప్యతా హక్కుల మధ్య సున్నితమైన సమతుల్యత అవసరమని సీజేఐ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత పరికరాలను అనవసరంగా జప్తు చేయడం తగదని స్పష్టంచేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ఆమోదించిన కొత్త నేర న్యాయ చట్టాలను సీజేఐ ప్రశంసించారు. న్యాయ వ్యవస్థను ఆధునీకరించడంలో ఇది ఒక కీలకమైన అడుగు అని పేర్కొన్నారు.
కృత్రిమ మేధ.. గేమ్ ఛేంజర్
కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు నుంచి దర్యాప్తు ప్రక్రియనంతటినీ డిజిటలైజ్ చేయాలని సీజేఐ సూచించారు. భారీ సంఖ్యలో కేసులు ఉన్నందున, జాప్యాన్ని నివారించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. మనం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను అధిగమించడంపై నేర న్యాయ అడ్మినిస్ట్రేషన్కు చెందిన అన్ని విభాగాలు వర్క్షాప్లు నిర్వహించాలని సూచించారు. నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడం ద్వారా దర్యాప్తు సంస్థలను అప్గ్రేడ్ చేయాలని అన్నారు. కృత్రిమ మేధ(ఏఐ)ను గేమ్ ఛేంజర్గా పేర్కొన్న సీజేఐ.. ఉత్తమ ఫలితం కోసం ఏఐను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని సూచించారు.
రుణాలపై కేంద్రం ఆంక్షలు .. రాజ్యాంగ ధర్మాసనానికి కేరళ కేసు
రాష్ర్టాల అప్పులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. రాష్ర్టాల అప్పులపై పరిమితులు విధించడం ద్వారా, రాష్ర్టాల హక్కులు, అధికారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నదని కేరళ ప్రభుత్వం చేసిన వాదనలను జస్టిస్లు సూర్యకాంత్, కేవీ విశ్వనాథన్లతో కూడిన బెంచ్ పరిశీలించింది. అనంతరం కేసును విస్తృత ధర్మాసనానికి నివేదిస్తున్నట్టు తెలిపింది. ఆర్టికల్ 131 ప్రకారం కేరళ ప్రభుత్వం ఈ కేసును దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ కేంద్ర, రాష్ర్టాల మధ్య తలెత్తిన ఏదైనా వివాదంలో అసలు అధికార పరిధిని సుప్రీంకోర్టు తేలుస్తుందని వివరిస్తుంది.