చెన్నై: ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. బస్సులో తన భార్యను కాలితో తన్నాడు. దీంతో గర్భవతి అయిన ఆమె కదులుతున్న బస్సు నుంచి కింద పడి మరణించింది. (Pregnant woman kicked out of Bus) ఈ విషయం తెలిసిన పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేశారు. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 19 ఏళ్ల వలర్మతికి వెంబర్పట్టికి చెందిన 24 ఏళ్ల పాండియన్తో ఎనిమిది నెలల కిందట వివాహమైంది. ఆదివారం ఆ దంపతులు దిండిగల్ నుంచి పొన్నమరావతికి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
కాగా, మద్యం మత్తులో ఉన్న పాండియన్ ఐదు నెలల గర్భిణీ అయిన భార్య వలర్మతితో బస్సులో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదరడంతో ఆగ్రహించిన అతడు భార్యను కాలితో తన్నాడు. దీంతో కనవాయిపట్టి సమీపంలో కదులుతున్న బస్సు నుంచి ఆమె రోడ్డుపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ అక్కడికక్కడే మరణించింది.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు నెలల గర్భిణీ అయిన వలర్మతి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్త పాండియన్ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.