భువనేశ్వర్, ఆగస్టు 24: బీజేపీ పాలిత ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఓ గర్భిణిని 108 అంబులెన్స్ సిబ్బంది ఏడు కిలోమీటర్ల దూరం స్ట్రెచర్పై మోసుకెళ్లారు. మారుమూల గ్రామానికి రహదారి లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన కరణ్జియా బ్లాక్లోని దుధియాని పంచాయతీ పరిధిలోని అన్లకాంత గ్రామంలో జరిగింది. సుమిత్ర శుంధికి పురిటి నొప్పులు రావడంతో దవాఖానకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. అయితే రహదారి లేకపోవడంతో అంబులెన్స్ను గర్భిణి ఉన్న ప్రదేశం వరకు తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. సిబ్బంది ఆమెను ప్ట్రెచర్పై పెట్టుకుని కాలినడకన తీసుకెళ్లాలని నిర్ణయించారు. అంబులెన్స్ డ్రైవర్ గోపాల్ చంద్ర నాయక్, అటెండెంట్ అంకిత్ మొహంతా, స్థానికుడు మునురామ్ సోరెన్ కలిసి సుమారు ఏడు కిలోమీటర్ల మేర ఆమెను స్ట్రెచర్పై మోసుకెళ్లారు. రహదారి ఉన్న ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆమెను అంబులెన్స్లోకి ఎక్కించారు. అక్కడి నుంచి ఆమెను కరణ్జియా దవాఖానకు తరలించారు.