పట్నా : బిహార్ సీఎం నితీష్ కుమార్ యువతకు ఏటా పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తే పాలక కూటమిలో చేరే విషయం ఆలోచిస్తానని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. రెండు రోజుల కిందట తాను నితీష్ను కలిశానని ప్రశాంత్ కిషోర్ ధృవీకరించారు. ఈ షరతుతోనే తాను నితీష్ కుమార్ కూటమిలో చేరే విషయం పరిశీలిస్తానని చెప్పారు.
మరోవైపు ప్రశాంత్ కిషోర్తో భేటీపై సీఎం నితీష్ కుమార్ కూడా బుధవారం పెదవివిప్పారు. కిషోర్తో భేటీ అయ్యానని, అయితే ఇది కేవలం మామూలుగా జరిగిన సమావేశమేనని, దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని అన్నారు. కిషోర్తో తన అనుబంధం పాత పరిచయమేనని ఆయన పట్ల తనకు ఎలాంటి కోపం లేదని చెప్పుకొచ్చారు. ఇక ఎన్డీఏ నుంచి వైదొలగిన అనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో విపక్షాల ఐక్యతకు నితీష్ కుమార్ చొరవ చూపుతున్నారు.