పనాజీ: రాజకీయ వ్యవూకర్త ప్రశాంత్ కిషోర్ను కలిసిన తర్వాతే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో చేరడంపై తాను నిర్ణయం తీసుకున్నట్లు గోవా మాజీ ముఖ్యమంత్రి లూజిన్హో ఫలేరో తెలిపారు. బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన టీఎంసీలో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై తాను తీసుకున్న నిర్ణయం గురించి గురువారం పనాజీలో మీడియాతో మాట్లాడారు. ‘నేను టీఎంసీ నాయకులను కలవలేదు. నేను I-PAC ని మాత్రమే కలిశాను. నేను నిర్ణయం తీసుకునే ముందు I-PACకు చెందిన ప్రశాంత్ కిషోర్ని కలిసి దీనిపై చర్చించా. దీనికి ముందు ఆయన నన్ను కూడా కలిశారు. అయితే టీఎంసీలో చేరమని కోరలేదు. కానీ కొన్ని అంచనాల గురించి చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడడం నాకు చాలా కష్టంగా అనిపించింది. అయితే గోవా, దేశం ప్రయోజనాల కోసం కోసం, బీజేపీని ఓడించడం కోసమే చివరకు నేను టీఎంసీలో చేరాను’ అని ఆయన వివరించారు.
గోవా ప్రజలు బీజేపీ ప్రభుత్వంపై చాలా వ్యతిరేకతతో ఉన్నారని, ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని ఫలేరో అన్నారు. దీదీ ఒక్కరే బీజేపీని ఎదుర్కోగలిగే బలమైన శక్తి అని, దేశానికి ఆమె లాంటి నేత కావాలన్నారు. వచ్చే ఏడాది జరుగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండానే అన్ని స్థానాల్లో టీఎంసీ పోటీ చేస్తుందని చెప్పారు. గోవాలో టీఎంసీ విజయానికి ఐ-ప్యాక్ సహకారం కోరతామని వెల్లడించారు.