Prajwal Revanna | లైంగిక దౌర్జన్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కర్ణాటకలో జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ.. దౌత్యపరమైన పాస్పోర్టుతో దేశం దాటి వెళ్లారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రన్ధిర్ జైశ్వాల్ చెప్పారు. ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నట్లు తేలింది. అంతేగానీ, ఆయన విదేశాలకు వెళ్లేందుకు రాజకీయంగా తమకెలాంటి ఆదేశాలు రాలేదని, తామూ ఎటువంటి ఆదేశాలివ్వలేదని గురువారం రన్ధిర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
పార్లమెంట్ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణ, ఎమ్మెల్యే రేవణ్ణలపై లైంగిక దౌర్జన్యం కేసు కర్ణాటక రాజకీయాలను కుదిపివేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ.. జర్మనీకి వెళ్లిపోయారంటూ వచ్చిన వార్తలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు రన్ధిర్ జైశ్వాల్ స్పందిస్తూ తమకు రాజకీయంగా ఎటువంటి ఆదేశాలు రాలేదని, తామూ ఎటువంటి వీసా కూడా జారీ చేయలేదన్నారు. దౌత్యపరమైన పాస్ పోర్టుతో దేశాన్ని వీడారని, జర్మనీకి వెళ్లేందుకు ఎలాంటి వీసా అవసరం లేదని రన్ధిర్ జైశ్వాల్ చెప్పారు.
ఆయన ఏ ఇతర దేశానికి వెళ్లడానికి కూడా వీసా జారీ చేయలేదని వెల్లడించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ పాస్ పోర్టు రద్దు చేస్తారా? అన్న ప్రశ్నపై నేరుగా స్పందించని రన్ధిర్ జైశ్వాల్ .. పాస్ పోర్టు రద్దుకు నియమావళి ఉందని, అయినా కోర్టు నుంచి తమకెలాంటి ఆదేశాలు రాలేదని అన్నారు.