బెంగళూరు, ఏప్రిల్ 29: కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపిన జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్లో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. సెక్స్ వీడియోల గురించి బీజేపీ హోలెనర్సిపుర అసెంబ్లీ అభ్యర్థి దేవరాజె గౌడ గతేడాది డిసెంబర్ 8న కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజేయేంద్రకు లేఖ రాశారు.
‘ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి దాదాపు మూడు వేల సెక్స్ స్కాండల్ వీడియోలు కాంగ్రెస్ నాయకుల చేతికి దొరికాయి. ఇవి ఎన్నికల్లో కాంగ్రెస్కు బ్లాక్మెయిల్ చేసే బ్రహ్మస్త్రం కావొచ్చు. జాతీయ స్థాయిలో ఇది మన పార్టీ ప్రతిష్టను దెబ్బ తీస్తుంది’ అని ఆ లేఖలో దేవరాజెగౌడ పేర్కొన్నారు. ఈ ఉదంతంపై బీజేపీ కేంద్ర, రాష్ట్ర అధి నాయకులు ఇప్పటివరకు స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
ప్రజ్వల్ కావాలా.. ఎమ్మెల్యేలు కావాలా?
ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోల ఉదంతం జేడీ(ఎస్)కు సొంత ఎమ్మెల్యేల నుంచే నిరసన వ్యక్తమవుతున్నది. పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు కావాలో.. ప్రజ్వల్ కావాలో తేల్చుకోవాలని కోలార్ ఎమ్మెల్యే సమృద్ధి వి మంజునాథ్ జేడీఎస్ అధిష్ఠానానికి లేఖ రాశారు. ప్రజ్వల్పై వచ్చిన ఆరోపణలు పార్టీ నాయకులను సిగ్గు పడేలా చేస్తున్నాయని.. ప్రజలు, మీడియా అడిగే ప్రశ్నలకు తాము సమాధానం చెప్పలేకపోతున్నామని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్టు జేడీఎస్ అధినేత కుమారస్వామి ప్రకటించారు.
చీర పిన్నులు తొలగించి వేధించేవారు
రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్ తనను లైంగికంగా వేధించేవారని వారి ఇంట్లో వంట మనిషి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘భార్య ఇంట్లో లేనప్పుడు రేవణ్ణ పనివారి చీర పిన్నులు తొలగించి అసభ్యంగా తాకేవారు’ అని ఆమె తెలిపారు.
ఇది రాజకీయ కుట్ర: రేవణ్ణ
తనపైన, తన కుమారుడిపైన వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు రాజకీయ ప్రేరేపితం, కుట్ర అని జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణ సోమవారం మీడియాకు తెలిపారు. వైరల్ అవుతున్న వీడియోలు నాలుగేండ్ల క్రితంవని వ్యాఖ్యానించారు. ప్రజ్వల్ విచారణకు వస్తారని వెల్లడించారు.
మోదీ, కేంద్రంపై విపక్షాల ఆగ్రహం
సెక్స్ స్కాండల్ ఉదంతంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. శివసేన(యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది దీనిపై ఎక్స్లో స్పందిస్తూ.. ఈ విషయంపై జాతీయ మహిళా కమిషన్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉండటం తనను షాక్కు గురి చేసిందన్నారు. ‘మోదీజీ మీ కూటమి అభ్యర్థి మహిళలను లైంగికంగా వేధిస్తున్నట్టు వీడియోల్లో కనిపిస్తున్నది. ఆమె ఏడుస్తున్నా.. అతడు దాన్ని వీడియో తీస్తూనే ఉన్నాడు. ప్రజ్వల్ ఇప్పుడు దేశంలో లేడు. ‘నారీశక్తి’ మీద మీ ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నా’ అని టీఎంసీ రాజ్యసభ ఎంపీ సాగరికా ఘోష్ ఎక్స్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.