PR Sreejesh : ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా యువ షూటర్ మనూభాకర్ వ్యవహరించనున్నారు. ఇప్పుడు ఆమెతోపాటు హాకీ గోల్కీపర్ శ్రీజేశ్కు కూడా ఈ అవకాశం దక్కింది. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. క్రీడాకారుల అభీష్టం మేరకు శ్రీజేశ్ను కూడా పతాకధారిగా ఎంపిక చేసినట్లు ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష వెల్లడించారు.
శ్రీజేశ్ గత రెండు దశాబ్దాలకుపైగా భారత క్రీడలకు, హాకీకి అద్భుతమైన సేవలందించారన్నారు. జావెలిన్ త్రోలో రజతం సాధించిన నీరజ్ చోప్రాతో తాను మాట్లాడానని, ముగింపు వేడుకల్లో శ్రీజేశ్ పతాకధారిగా ఉండేందుకు అతడు సుముఖత వ్యక్తం చేశాడని ఉష తెలిపారు. ‘మీరు నన్ను అడగకపోయినా నేను శ్రీ భాయ్ పేరు సూచిస్తాను’ అని నీరజ్ పేర్కొన్నట్లు ఆమె చెప్పారు.
పారిస్ ఒలింపిక్స్లో భారత యువ షూటర్ మనూభాకర్ రెండు కాంస్య పతకాలు సాధించి సత్తా చాటారు. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజతం గెలిచాడు. భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. అనంతరం సీనియర్ గోల్ కీపర్ శ్రీజేశ్ తన హాకీ కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో ఆయనకు పతాకధారిగా అరుదైన గౌరవం లభించడం విశేషం.