పాట్నా: నిర్మాణంలో ఉన్న ఒక వంతెన గాలి వానకు కూలింది. బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఖగారియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ నాలుగు లైన్ల వంతెనను నిర్మిస్తున్నారు. అగువానీ-సుల్తాన్గంజ్ బ్రిడ్జి నిర్మాణాన్ని సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్గా పరిగణిస్తున్నది. అయితే శుక్రవారం అర్థ రాత్రి తర్వాత ఉరుములతో కూడిన గాలి వాన కురిసింది. దీంతో నిర్మాణంలో ఉన్న ఈ వంతెన కొంత భాగం కూలిపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.
కాగా, సుల్తాన్గంజ్ జేడీయూ ఎమ్మెల్యే లలిత్ నారాయణ్ మండల్ శనివారం కూలిన వంతెన భాగాన్ని పరిశీలించారు. నాణ్యత లేని మెటీరియల్ వాడకం వల్ల ఇలా జరిగిందని విమర్శించారు. ఈ విషయాన్ని సీఎం నితీశ్ కుమార్కు తెలియజేసినట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు జరుపుతామని అన్నారు.
మరోవైపు ఈ వంతెనకు 2014 ఫిబ్రవరి 23న సీఎం నితీశ్ కుమార్ శంకుస్థాపన చేశారు. నాటి నుంచి దీని నిర్మాణ పనులు నెమ్మదిగా సాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్హెచ్ 31, 107లను కలుపుతూ 3,160 మీటర్ల పొడవైన ఈ వంతెనను రూ.1,710 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. టోల్ ప్లాజా, డాల్ఫిన్ వ్యూపాయింట్తో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జీ సుల్తాన్గంజ్, ఖగారియా, సహర్సా, సుపాల్, మాధేపురాతోపాటు ఇతర జిల్లాల మధ్య దూరాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.