ముంబై : ఎన్సీపీలో పవార్ వర్సెస్ పవార్ వార్ ఎన్నికల కమిషన్కు చేరడంతో ఢిల్లీ కేంద్రంగా మహారాష్ట్ర రాజకీయం (Maharashtra Politics )రసవత్తరంగా మారింది. మామ శరద్ పవార్ను మోసగించి పార్టీని ఫిరాయించి షిండే సర్కార్లో చేరిన అజిత్ పవార్పై ఎన్సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. బాహుబలి సినిమాలోని సీన్ను ప్రతిబింబిస్తూ అజిత్ పవార్ను కట్టప్పగా, శరద్ పవార్ను బాహుబలిగా అభివర్ణిస్తూ ఎన్సీపీ విద్యార్ధి విభాగం ఢిల్లీలోని పార్టీ కార్యాలయం బయట పోస్టర్లను ప్రదర్శించింది.
పోస్టర్పై అజిత్ పవార్ను వెన్నుపోటుదారుగా ఎన్సీపీ విద్యార్ధి విభాగం రాష్ట్రవాది విద్యార్ధి కాంగ్రెస్ అభివర్ణించింది. ఇలాంటి వెన్నుపోటుదారులను ప్రజలు మర్చిపోరని పేర్కొంది. ఇక ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చిన అజిత్ పవార్ తనకు 31 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తన సంఖ్యా బలాన్ని చాటారు. బాంద్రాలో అజిత్ పవార్ ఏర్పాటు చేసిన సమావేశానికి 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో 31 మంది హాజరు కాగా, శరద్ పవార్ వర్గీయుల భేటీకి కేవలం 14 మంది ఎమ్మెల్యేలే హాజరయ్యారు.
తనకు మద్దతుగా ఎమ్మెల్యేలు, ఎంపీల సహకారంతో అజిత్ పవార్ వర్గం 40 అఫిడవిట్లను సమర్పించడంతో ఎన్సీపీలో వర్గ పోరు ఈసీ వద్దకు చేరింది. తమదే నిజమైన ఎన్సీపీ అని ఇరు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ పేరు, చిహ్నం తమకే దక్కాలని అజిత్ పవార్ వర్గం పట్టుబడుతుండటంతో గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించేందుకు శరద్ పవార్ సన్నద్ధమయ్యారు.
Read More :