న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) యుద్ధ నీతిలో కొత్త పంథాకు తెరలేపింది. టెక్నాలజీ ఆధారంగా యుద్ధం ఎలా చేయాలన్న అనేక విషయాలను ఆ ఆపరేషన్లో తెలుసుకున్నారు. అయితే భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలను ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలకు చెందిన బలగాలు ఇప్పుడు తమ ఆధునిక నైపుణ్యాన్ని పెంచుకునే పనిలో పడ్డాయి. దీనిలో భాగంగానే ఢిల్లీలోని మానెక్షా కేంద్రంలో యుద్ధ కోర్సును ప్రారంభించాయి. యుద్ధ టెక్నాలజీలో వస్తున్న మార్పులు, దానికి అనుగుణంగా ఎలా పటిష్టంగా తయారు కావాలన్న లక్ష్యంతో త్రివిధ దళాలు శిక్షణ మొదలుపెట్టాయి. సుమారు మూడు వారాల పాటు ఆ శిక్షణా కోర్సు జరగనున్నది. యుద్ధాల్లో టెక్నాలజీ ప్రభావం, మూడు దళాల మధ్య సమన్వయం ఎలా కుదుర్చుకోవాలి, స్వదేశీ ఆయుధాల ఉత్పత్తి లాంటి అంశాలపై ఈ స్టడీ జరగనున్నది.
రక్షణ పరిశ్రమలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్తో పాటు త్రివిధ దళాలకు చెందిన వ్యక్తులు ఈ కోర్సులో పాలుపంచుకుంటున్నారు. త్రివిధ దళాల్లోని మేజర్ ర్యాంకు నుంచి మేజర్ జనరల్స్, జూనియర్ ఆఫీసర్లు తమ టెక్నాలజీ నైపుణ్యాన్ని షేర్ చేసుకోనున్నారు. ఆపరేషనల్ ఎక్స్పీరియన్స్తో పాటు వ్యవూహాత్మక పరిజ్ఞానాన్ని సీనియర్ ఆఫీసర్లు పంచుకోనున్నారు. మిలిటరీ ఆపరేషన్స్లో జరిగే డొమెయిన్ స్పెసిఫిక్ వార్ఫేర్ గురించి కోర్సులో నేర్చుకోనున్నారు. వార్ఫేర్ కోర్సును నిర్వహించడం ఇది మూడోసారి. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇలాంటి శిక్షణా తరగతుల్ని నిర్వహించడం మొదటి సారి అవుతుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎక్కువ సంఖ్యలో కొత్త టెక్నాలజీకి చెందిన డ్రోన్లను వినియోగించారు. ఇలాంటి వాటి గురించి తాజా కోర్సులో స్టడీ చేయనున్నారు.
ఆధునిక యుద్ధ పరిజ్ఞానాన్ని సమకూర్చుకునేందుకు ఈసారి బడ్జెట్లో రక్షణ రంగానికి అధిక నిధులు కేటాయించిన విషయం తెలిసిందే.