రాంపూర్, నవంబర్ 13: హిమాచల్ప్రదేశ్లో నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలను ఓ ప్రైవేటు వాహనంలో తరలించడం కలకలం రేపింది. సిమ్లా జిల్లాలోని రాంపూర్ నియోజకవర్గంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకొన్నది. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీజేపీ ఆదేశాలనుసారం ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే ఉద్దేశంతో ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు దుత్తానగర్ పోలింగ్ కేంద్రం సిబ్బందిని సస్పెండ్ చేశారు.
ఈవీఎంలను స్ట్రాంగ్రూమ్కు తరలించారు. స్ట్రాంగ్రూమ్ బయట కాంగ్రెస్, బీజేపీ నేతల సమక్షంలో ఈవీఎంలను పరిశీలించిన ఈసీ అధికారులు.. యంత్రాల సీలింగ్ సరిగానే ఉన్నదని, ట్యాంపరింగ్ జరుగలేదని పేర్కొన్నారు. ఈవీఎంలను త్వరగా చేర్చాలనే ఉద్దేశంతో సిబ్బంది ప్రైవేటు వాహనంలో తరలించే ప్రయత్నం చేశారని తెలిపారు. శనివారం హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. అటు.. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, సర్వే ఫలితాల ప్రకటనను కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 5 వరకు నిషేధించింది. ఆదివారం ఉదయానికి అందుబాటులో ఉన్న ప్రాథమిక డాటా ప్రకారం హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో 74.05 శాతం పోలింగ్ నమోదైంది. 2017లో పోలింగ్ శాతం 75.6గా రికార్డు అయ్యింది.