తిరువనంతపురం: రష్యాలో అధ్యక్ష ఎన్నికలు (Russian Presidential Elections) జరుగుతున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు పోలింగ్ కొనసాగనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రష్యన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో భాగంగా భారత్లోనూ ఓ పోలింగ్ కేంద్రంలో అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ జరిగింది. తిరువనంతపురంలోని రష్యన్ హౌస్లో ఉన్న రష్యన్ ఫెడరేషన్ గౌరవ కాన్సులేట్ వద్ద ప్రత్యేకగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. దీంతో కేరళలో నివసిస్తున్న ఆ దేశ పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో రాష్ట్రంలో కూడా ఓటింగ్ జరిగింది.
రష్యా అధ్యక్ష ఎన్నికలకు కేరళలో ఓటింగ్ను ఏర్పాటు చేయడం ఇది మూడోసారి అని రష్యన్ హౌస్ డైరెక్టర్ రతీష్ నాయర్ (Ratheesh Nair) అన్నారు. పోలింగ్ విజయవంతంగా జరగడానికి సహకరించిన రష్యాన్లను ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేరళలోని రష్యన్ జాతీయులు, పర్యాటకుల కోసం దీనిని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇది రష్యన్ ఫెడరేషన్ కేంద్ర ఎన్నికల సంఘంతో అనుబంధం కలిగి ఉండటం ఆనందంగా ఉందన్నారు.
కాగా, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు రష్యాలోని పోలింగ్ కేంద్రాలు ఓపెన్ అయ్యాయి. ఆరేండ్లపాటు పదవీ కాలం కలిగిన రష్యా అధ్యక్ష హోదా కోసం నలుగురు పోటీపడుతున్నారు. పుతిన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉండగా, లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నేత లియోనిడ్ స్లట్స్కీ, కమ్మూనిస్ట్ నేత నికోలే కరిటొనోవ్, లిబరల్ సెంట్రిస్ట్ వాదిస్లావ్ దవనకోవ్ పోటీలో ఉన్నారు. 2020లో రాజ్యాంగ సవరణ తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. కాగా, వ్లాదిమిర్ పుతిన్ మరోసారి దేశాధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడం ఇప్పటికే ఖాయమైనట్లు తెలుస్తున్నది.