చెన్నై : తనకు అతిపెద్ద రాజకీయ ప్రత్యర్ధి కులమేనని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హాసన్ అన్నారు. ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి తరపున కమల్ ప్రచారం చేయనున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు పా రంజిత్ సారధ్యంలో నీలం కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేసిన నీలం బుక్స్ను కమల్ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ కులం తనకు అతిపెద్ద శత్రువని వ్యాఖ్యానించారు.
తాను 21 ఏండ్ల యువకుడిగా ఉన్నప్పటినుంచి ఈ విషయం చెబుతున్నానని, ఇప్పటికీ తనది ఇదే మాటని, తన అభిప్రాయం ఎన్నడూ మారదని స్పష్టం చేశారు. చక్రాన్ని కనిపెట్టిన తర్వాత మనిషి దేవుడిని సృష్టించాడని, మనమీదే మనం సృష్టించింది దాడి చేస్తే అంగీకరించేది లేదని అన్నారు. పా రంజిత్ ఆర్ట్ పిల్మ్ను సైతం అందరికీ నచ్చే మెచ్చే చిత్రంగా మలిచే ఫార్ములాను ఆకళింపు చేసుకున్నాడని ప్రశంసించారు.
కాగా ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఇలంగోవన్ తరపున ప్రచారం చేస్తారని ఎంఎన్ఎం ఓ ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి 27న ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఢిల్లీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కమల్ హాసన్ రాహుల్ గాంధీని కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ ఆహ్వానం మేరకు రాహుల్ను కలిసిన కమల్ కాంగ్రెస్ ఎంపీతో కలిసి కొన్ని కిలోమీటర్లు పాదయాత్రలో పాల్గొన్నారు.