లక్నో: రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఉచితాలతో ఓటర్లను ఆకర్షించి ఆ తర్వాత వారిని మోసం చేస్తున్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పదేపదే జరుగుతున్న ఇలాంటి మోసాలు, ద్రోహం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. (Mayawati) సోమవారం లక్నోలో జరిగిన బీఎస్పీ కార్యవర్గ సమావేశంలో మాయావతి మాట్లాడారు.
ఎన్నికలకు ముందు ఉచితాలు, ముఖ్యంగా మహిళలకు వ్యక్తిగత ప్రయోజనాలు చేకూర్చే రకరకాల ఆకర్షణీయమైన వాగ్దానాలు, ప్రకటనల ద్వారా ఓటర్లను తప్పుగా ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కానీ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పదేపదే వాగ్దానాలను ఉల్లంఘించడాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారని గుర్తు చేశారు.
కాగా, నిరంతరం జరుగుతున్న వాగ్దానాల భంగం, మోసం, బాధ్యతారాహిత్యానికి వ్యతిరేకంగానే బీఎస్పీ పోరాడుతున్నదని మాయావతి తెలిపారు. జెన్ జెడ్, జెన్ ఆల్ఫా తరాల యువత ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎక్కువగా గళం విప్పుతున్నారని గుర్తు చేశారు. పోలీసు కేసులతో సహా ప్రభుత్వ అణచివేతను వారు ఎదుర్కొంటున్నారని అన్నారు. ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగంతో ముడిపడి ఉన్న వలసలు, నేపాల్లోని వరద పరిస్థితి, తూర్పు ఉత్తరప్రదేశ్పై దాని ప్రభావం వంటి పలు అంశాలపై ఆమె మాట్లాడారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ ఐదవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ‘అందరి హితం, అందరి సుఖం’ ఆధారంగా ఉత్తమమైన చట్టబద్ధ పాలన అందిస్తుందని మాయావతి విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ చేస్తున్న సన్నాహాలను సమీక్షించారు. ఓటర్ల జాబితాలపై ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)తో పాటు అభ్యర్థుల ఎంపిక, పోలింగ్ బూత్ స్థాయి వరకు కమిటీల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై పార్టీ నేతలతో ఆమె చర్చించారు. అక్టోబర్ 9న జరుగనున్న కాన్షీరామ్ వర్ధంతి కార్యక్రమాన్ని ‘మిషనరీ స్ఫూర్తి’తో నిర్వహించాలని పార్టీ నేతలకు మాయావతి సూచించారు.