న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు సంస్థ, క్యాడరే ప్రధాన బలం. ఇప్పుడు వారితోపాటు కంటెంట్ క్రియేటర్లు, మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లతో కూడిన డిజిటల్ ఆర్మీ ఉద్భవిస్తున్నది. వారివద్ద ఎటువంటి పార్టీ పదవి లేదా జెండా లేదు. కానీ వారికి వేలాది, లక్షలాది స్క్రీన్లను చేరుకోగల సామర్థ్యం ఉన్నది. ఒక రీల్, మీమ్ లేదా షార్ట్ వీడియో కొన్ని గంటల్లోనే లక్షలాది మంది యువతకు చేరువవుతున్నది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు, పార్టీలు 10,000 నుంచి 50,000 మంది ఫాలోవర్లు ఉన్న స్థానిక ఇన్ఫ్లూయెన్సర్ల నెట్వర్క్లను రూపొందించడానికి పనిచేస్తున్నాయి.
డిజిటల్ క్యాంపెయిన్లతో ముడిపడి ఉన్న వ్యక్తుల ప్రకారం చిన్న, మధ్యతరహా ఇన్ప్లుయెన్సర్లు ఏ ఒక్క రాజకీయ పార్టీతోనూ శాశ్వతంగా సంబంధం కలిగి ఉండరు. వేర్వేరు సమయాల్లో వారు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ లేదా ఇతర పార్టీల కోసం పనిచేయవచ్చు. రాజకీయ రీల్ కోసం క్రియేటర్లకు రూ. 15,000 నుంచి రూ. 50,000 వరకు, పోస్ట్ కోసం రూ. 15,000 నుంచి రూ. 20,000 వరకు చెల్లిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. సోషల్ మీడియా కంపెనీ నడుపుతున్న శ్యామ్ తివారీ ప్రకారం.. 5 లక్షల వరకు సబ్స్ర్కైబర్లు ఉన్న క్రియేటర్లు రూ. 50,000 నుంచి రూ. 1 లక్ష వరకు వసూలు చేస్తారు. 50 లక్షల కంటే ఎక్కువ సబ్స్ర్కైబర్లు ఉన్న ప్రధాన క్రియేటర్ విషయానికి వస్తే ఒకే ఒక కంటెంట్ ధర రూ. 30 లక్షల వరకు పెరుగవచ్చు.
స్థానిక ప్రభావమే ముఖ్యం
క్రియేటర్ల సోషల్ రీచ్, సిద్ధాంతం, వారి హావభావాల ఆధారంగా కూడా పార్టీలు వారిని అంచనా వేస్తాయి. కొన్ని ప్రదేశాల్లో 15,000 మంది ఫాలోవర్లు ఉన్న ఉపాధ్యాయుడు, రైతు లేదా హాస్యనటుడు జాతీయ సెలబ్రిటీ కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చు. త్వరిత కథనాల కోసం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లను ఉపయోగిస్తుండగా, నాయకుడి ఇమేజ్ను నిర్మించడానికి పాడ్కాస్ట్లను ఉపయోగిస్తున్నారు. ఎన్నికల సంఘం సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనలు, ఎన్నికల ఖర్చును నియంత్రిస్తున్నది.
కానీ రాజకీయ చెల్లింపులు నగదు రూపంలో జరుగుతున్నాయనే వాదనలు ఉన్నాయి. ఒక ఉపాధ్యాయుడు విద్యా విధానాన్ని ప్రశంసిస్తే అది పెయిడ్ ప్రమోషన్ అవునా కాదా అని వీక్షకులకు ఎలా తెలుస్తుంది? 2027లో జరుగబోయే ఎన్నికల సమయంలో ఓటర్లకు ఇది సవాలుగా మారనున్నది. కాంగ్రెస్ ‘జెన్-జీ కనెక్ట్ యాత్ర’తో ముడిపడి ఉన్న సుధాన్షు వాజపేయి మాట్లాడుతూ, రీల్స్ పార్టీ కార్యకర్త కంటే ఎక్కువ ప్రజాదరణను తీసుకురాగలవు. కానీ ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకురావడం ఇప్పటికీ కార్యకర్త పనే అని అన్నారు. సోనమ్ వాంగ్చుక్ లద్దాఖ్ ప్రచారం డిజిటల్ మద్దతు క్షేత్రస్థాయిలో చర్యగా మారగలదని చూపించింది. 2024 నిరాహార దీక్ష తరువాత, కనీసం 50 నగరాల్లో ‘ఫ్రెండ్స్ ఆఫ్ లద్దాఖ్’ కార్యక్రమాలు జరిగాయి. అయితే ప్రతి వైరల్ క్యాంపెయిన్ తప్పనిసరిగా ఓట్లుగా మారాల్సిన అవసరం లేదు. ‘జాగో కర్ణాటక’ కన్వీనర్ నూర్ శ్రీధర్ కూడా సోషల్ మీడియా, బూత్స్థాయి నిర్వహణ మధ్య సమన్వయం కీలకమని భావిస్తున్నారు.