లక్నో: రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే తన మద్దతని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం రాత్రి విందు ఇచ్చిన నేపథ్యంలో శనివారం ఆయన ఈ ప్రకటన చేశారు. ‘సమాజ్వాదీ పార్టీ నన్ను పిలవలేదు, నా ఓటు అడగలేదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న నన్ను ఆహ్వానించారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముని అక్కడ కలిశాను. ఆమెకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను’ అని అన్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ను ఆయన విమర్శించారు. తన సూచనలను అఖిలేష్ సీరియస్గా తీసుకుని ఉంటే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేదని తెలిపారు. ఎస్పీ కూటమిలోని అనేక పార్టీలు ఇప్పుడు విడిపోతున్నాయని అన్నారు. అఖిలేష్ యాదవ్ రాజకీయ అపరిపక్వతే దీనికి కారణమని ఆరోపించారు.
కాగా, ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు మద్దతు కూడగట్టేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం రాత్రి ఇచ్చిన విందుకు శివపాల్ యాదవ్తోపాటు ఎస్పీ కూటమిలో కీలకమైన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధినేత ఓం ప్రకాష్ రాజ్భర్, జనసత్తా దళ్ డెమోక్రటిక్ చీఫ్ రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా, ఉత్తరప్రదేశ్లోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) ఒంటరి ఎమ్మెల్యే ఉమా శంకర్ సింగ్ కూడా హాజరయ్యారు.
మరోవైపు తన పార్టీ ఎస్పీ కూటమితోనే ఉందని ఓం ప్రకాష్ రాజ్భర్ తెలిపారు. అయితే అఖిలేష్ యాదవ్కు ఇష్టం లేకపోతే బలవంతంగా ఎస్పీతో కలిసి ఉండలేనని ఆయన అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిచ్చే అంశంపై తన సొంత నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. కాగా, విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సింగ్ గురువారం యూపీ పర్యటన సందర్భంగా జరిగిన సమావేశానికి బాబాయ్ శివపాల్ యాదవ్తోపాటు రాజ్భర్ను అఖిలేష్ యాదవ్ ఆహ్వానించలేదు.