Custodial Death in Assam | పోలీసు కస్టడీలో పౌరుడు మృతి చెందడంతో అసోమీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. తమ ఆత్మీయుడు పోలీసు హింసకు తాళలేక మరణించడంతో ఆయన బంధు మిత్రులు అసోంలోని నాగాన్ జిల్లాలోని బటాడ్రావా పోలీస్స్టేషన్కు శనివారం నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. తాము పోలీసు స్టేషన్కు తీసుకొచ్చిన వ్యక్తి రాత్రి రోడ్డుపై తాగి పడిపోయాడని చెప్పుకొచ్చారు.
సాల్నాబరీ ప్రాంత వాసి చేపల వ్యాపారి సఫీకుల్ ఇస్లామ్ అనే వ్యక్తిని రూ.10 వేలు లంచం ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంత మొత్తం ఇవ్వలేకపోవడంతో అతడిని తీసుకెళ్లి పోలీసులే చంపారని సఫీకుల్ ఇస్లాం కుటుంబం ఆరోపించింది.
సఫీకుల్ను కలుసుకునేందుకు శనివారం పోలీస్ స్టేషన్కు వెళితే.. అతడి ఆరోగ్యం బాగా లేదని దవాఖానకు తరలించామని పోలీసులు చెప్పారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. తీరా తాము దవాఖానకు వెళితే, అక్కడ మార్చురీలో సఫీకుల్ మృతదేహం ఉందని చెప్పారు. ఈ సంగతి తెలిసిన సఫీకుల్ ఇరుగు పొరుగు వారు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్లో విధ్వంసం సృష్టించారు. చివరకు ఆగ్రహం పట్టలేక పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టారు.