చెన్నై: ‘కాళి’ పేరుతో రూపొందిస్తున్న డాక్యుమెంటరీలో కాళి మాత సిగరేట్ తాగుతున్నట్టుగా విడుదలైన పోస్టర్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తమిళనాడులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. అయితే ఇది ఏ డాక్యుమెంటరీనో.. సినిమా పోస్టరో కాదు. తమ స్నేహితుని వివాహం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతు కొందరు యువకులు ఏర్పాటుచేసిన బ్యానర్. అందులో శివుడు (Lord Shiva) సిగరెట్ తాగుతున్నట్లుగా ఫొటోను ముద్రించారు.
కన్యాకుమారి జిల్లా ఆరోకియపురానికి చెందిన ప్రతీష్ వివాహం జరుగుతున్నది. ఈ సందర్భంగా అతని స్నేహితులు ప్రతీష్, అతని కాబోయే భార్య ఫొటోలతోపాటు శివుడు సిగరెట్ తాగుతున్నట్లు బ్యానర్లు ముద్రించి ఆరోకియపురం వీధుల్లో ఏర్పాటు చేశారు. వాటిని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వాటిని తొలగించారు. వధూ వరులకు సమన్లు జారీచేశారు. స్టేషన్కు పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపించారు.