అహ్మదాబాద్: ఒక పోలీస్ అధికారి కదులుతున్న బస్సులో భార్యను హత్య చేశాడు. అనంతరం ఆమె శవం వద్ద కూర్చొన్నాడు. గుజరాత్లోని ఛోటాడేపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అమృత్ రత్వా అనే వ్యక్తి సూరత్ జిల్లాలో పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య మంగుబెన్ గుజరాత్ ఆర్టీసీలో కండక్టర్గా పని చేస్తున్నది. అయితే ఆమెకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని భర్త అమృత్ అనుమానించాడు. మంగళవారం ఉదయం డ్యూటీకి వెళ్లిన భార్యతో ఫోన్లో వాగ్వాదానికి దిగాడు.
ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అమృత్ తన భార్య మంగుబెన్ను హత్య చేయాలని నిర్ణయించాడు. భిక్పూర్ గ్రామానికి వెళ్లి ఆమె కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న బస్సు ఎక్కాడు. మెల్లగా ఆమె కూర్చొన్న కండక్టర్ సీటు వద్దకు వెళ్లాడు. వెంట తెచ్చిన కత్తితో భార్యను పలుమార్లు పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోకుండా భార్య శవం వద్ద కూర్చొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి అమృత్ను అరెస్ట్ చేశారు. అతడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.