ఇంఫాల్: మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. (Manipur Violence) పోలీస్ కమాండోలపై మిలిటెంట్స్ కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఒక పోలీస్ కమాండోకు గాయాలయ్యాయి. అలాగే ఆందోళనకారులు కొందరి ఇళ్లకు నిప్పుపెట్టారు. మణిపూర్లోని సరిహద్దు నగరమైన మోరేలో ఈ సంఘటన జరిగింది. శనివారం అనుమానిత తిరుగుబాటుదారులు, పోలీసు కమాండోల మధ్య కాల్పులు జరిగాయి. మోరే నుంచి పెట్రోలింగ్ పాయింట్ వైపు వెళ్తున్న పోలీసు వాహనాల కాన్వాయ్పై మిలిటెంట్లు మెరుపుదాడి చేశారు. ఐఈడీలు, ఇతర పేలుడు పదార్థాలను ఉపయోగించారు. పోలీస్ కమాండోలపై కాల్పులు జరిపారు.
ఒక కమాండో గాయపడగా, అస్సాం రైఫిల్స్ క్యాంపునకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, మోరేలో తాజాగా హింస చెలరేగింది. కొందరు వ్యక్తులు రెండు ఇళ్లకు నిప్పుపెట్టినట్లు స్థానికులు తెలిపారు. మరో సంఘటనలో రాజధాని ఇంఫాల్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్పోక్పిలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక యువకుడ్ని కాల్చి చంపారు. శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ సంఘటన జరిగింది.
మరోవైపు మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ యువకుడి హత్యను ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. నిందితులను పట్టుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. సమస్యలను చర్చలు ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.