భోపాల్: ఏడేళ్ల కిందట ఒక గుడి బయట విడిచిన బూట్లు చోరీ కావడంతో నాడు అధికారిగా ఉన్న ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా కొన్ని బూట్లను స్వాధీనం చేసుకున్నామని, వాటిలో ఆయన బూట్లను గుర్తించాలంటూ (identify stolen shoes) ఆ పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు వచ్చింది. అయితే బూట్ల ఖరీదు కన్నా ఎక్కువగా ప్రయాణం కోసం ఖర్చు చేసి ఆ పోలీస్ స్టేషన్కు వెళ్లాలా వద్దా అన్న డైలమాలో ఆ వ్యక్తి ఉన్నాడు.
మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాకు చెందిన మహేంద్ర కుమార్ దూబే, ఫిషరీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పదవీ విరమణ చేశాడు. ఆ హోదాలో ఉన్నప్పుడు 2017లో రాజస్థాన్ చిత్తోర్గఢ్ జిల్లాలోని సన్వారియా సేఠ్ ఆలయాన్ని సందర్శించాడు. అప్పుడు గుడి బయట విడిచిన ఆయన బూట్లు అనంతరం కనిపించలేదు. దీంతో 2017 జనవరి 14న స్థానిక మన్సాఫియా పోలీస్ స్టేషన్లో దీని గురించి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని ఆయన మరిచిపోయాడు.
కాగా, ఒక జడ్జి కుమారుడి బూట్లు కూడా ఆ ఆలయం వద్ద మాయం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఒక వార్తాపత్రికలో రావడాన్ని మహేంద్ర కుమార్ దూబే చూశాడు. దీంతో ఏడేళ్ల కిందట ఆ ఆలయం వద్ద తన బూట్లు చోరీ కావడంపై ఇచ్చిన ఫిర్యాదు కాపీని జత చేస్తూ ఆ పోలీస్ స్టేషన్కు లేఖ రాశాడు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఆ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఒకరు దూబేకు ఫోన్ చేశాడు. చోరీ అయిన కొన్ని చెప్పులు, బూట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పాడు. పోలీస్ స్టేషన్కు వచ్చి వాటిలో ఆయన బూట్లను గుర్తించాలని కోరాడు. అయితే నాడు గుడి బయట పోగొట్టుకున్న పాత బూట్ల కోసం వాటి ఖరీదు కంటే ఎక్కువగా ప్రయాణం కోసం వెచ్చింది రాజస్థాన్లోని ఆ పోలీస్ స్టేషన్కు వెళ్లాలా వద్దా అన్న డైలమాలో ఆ మాజీ అధికారి ఉన్నాడు.