Hemanth Soren: మనీ లాండరింగ్ కేసులో అరెస్టయ్యి, ఈడీ కస్టడీలో ఉన్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో త్వరలో జరగబోయే బలపరీక్షలో పాల్గొననున్నారు. బలపరీక్షలో సోరెన్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు జార్ఖండ్ రాజధాని రాంచిలోని PMLA కోర్టు అనుమతించింది. కాగా, జార్ఖండ్ అసెంబ్లీలో వచ్చే సోమవారం (ఫిబ్రవరి 5) బలపరీక్ష జరగనుంది. సీఎం చంపాయ్ సోరెన్ సభలో తన బలాన్ని నిరూపించుకోనున్నారు.
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గత బుధవారం (జనవరి 31) అరెస్ట్ చేశారు. దాంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం జేఎంఎం ఉపాధ్యక్షుడు చంపాయ్ సోరెన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. పది రోజుల్లోగా సభలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆయనను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో చంపాయ్ సోరెన్ అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంకీర్ణ సర్కారులోని జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేయి జారిపోకుండా ముందు జాగ్రత్తతో వాళ్లను హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్లోని ఓ రిసార్టులో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్ ఏర్పాటు చేశారు.
శుక్రవారం రాత్రి జార్ఖండ్ క్యాబినెట్ భేటీ అయ్యి ఈ నెల 5, 6 తేదీల్లో అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించింది. ఫిబ్రవరి 5న అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతుందని ఇవాళ ఉదయం అధికార పక్షం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బలపరీక్షలో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని సోరెన్ కోర్టును కోరాడు. దాంతో కోర్టు అందుకు అనుమతించింది.