న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆవిష్కరించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 250 బీసీ నాటి ప్రసిద్ధ లయన్ క్యాపిటల్ ప్రతిమ అయిన ఈ భారీ జాతీయ చిహ్నాన్ని పూర్తిగా కాంస్యంతో తయారు చేశారు. దీని ఎత్తు 6.5 మీటర్లు కాగా, బరువు 9,500 కిలోలు.
ఇంత బరువును సపోర్ట్ చేసేలా 6,500 కిలోల బరువున్న స్టీల్ నిర్మాణంపై జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. దీనిని 150 భాగాలుగా చేసి భవనం పైకప్పు పైకి తీసుకెళ్లి జత చేశారు. దీనికి సుమారు రెండు నెలల సమయం పట్టింది. వంద మందికిపైగా ఆర్టిస్టులు ఆరు నెలలకుపైగా శ్రమించి తయారు చేసిన ఈ జాతీయ చిహ్నం కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాన ఆకర్షణగా నిలువనున్నది.
కాగా, రూ.1,250 కోట్ల వ్యయంతో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. తొలుత ప్రాజెక్ట్ ఖర్చు రూ.977 కోట్లుగా అంచనా వేయగా అది 29 శాతం మేర పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్లో భాగంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్రపతి భవన్కు కూతవేటు దూరంలోని 13 ఏకరాల విస్తీర్ణంలో నాలుగంతస్తుల కొత్త పార్లమెంట్ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి దీని నిర్మాణం పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ డెడ్లైన్ను ఈ ఏడాది అక్టోబర్కు పొడిగించారు.