న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో నెలకొన్న ఆక్సిజన్ సిలిండర్ల కొరతపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమీక్షించారు. పలు రాష్ట్రాలలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత వల్ల కరోనా రోగులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య, స్టీల్, రోడ్డ్ రవాణా, డీపీఐఐటీ మంత్రిత్వ శాఖల అధికారులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాను పెంచేందుకు సమన్వయంతో పనిచేయాలని, స్టీల్ ప్లాంట్లలోని మిగులు ఆక్సిజన్ను ఆసుపత్రులకు సరఫరా చేయాలని సూచించారు. అవపరమైతే ఆక్సిజన్ ఉత్పత్తిని 24 గంటలు చేపట్టాలని, ట్యాంకర్ల రవాణాను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
మరోవైపు కరోనా తీవ్రత నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 50 వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ దిగుమతి కోసం కేంద్రమంత్రుల టీమ్ త్వరలో టెండర్లను ఖరారు చేయనున్నది. అలాగే వంద కొత్త ఆసుపత్రులలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికి పీఎం కేర్స్ నిధులను వినియోగిస్తారు.