న్యూఢిల్లీ: నాలుగు రోజుల అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడిపారు. మొత్తం 65 గంటల్లో అమెరికా గడ్డపై 20 సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఇక విమానంలోనూ ఆయన నాలుగు మీటింగ్స్లో పాల్గొనడంతో మొత్తం సమావేశాల సంఖ్య 24కు చేరినట్లు ప్రముఖ న్యూస్ సైట్ న్యూస్18 వెల్లడించింది. మోదీ ప్రతి పర్యటనలాగే ఈ అమెరికా పర్యటన కూడా తక్కువ సమయంలో, ఎక్కువ ఉత్పాదకత సాధించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అమెరికా వెళ్లే సమయంలో ఈ నెల 22న విమానంలో ప్రధాని మోదీ రెండు సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వాషింగ్టన్లో దిగిన వెంటనే మరో మూడు భేటీలు జరిగాయి. ఇక ఈ నెల 23న అమెరికాలోని ఐదు కంపెనీల సీఈవోలతో వేర్వేరుగా భేటీ కావడంతోపాటు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడె సుగాతోనూ మోదీ సమావేశమయ్యారు. ఆ తర్వాత తన అంతర్గత టీమ్తో మోదీ మరో మూడు సమావేశాలు నిర్వహించారు.
ఇక ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తోపాటు క్వాడ్ సమావేశంలో పాల్గొనే ముందు మరో నాలుగు అంతర్గత సమావేశాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ నెల 25న ఇండియాకు తిరిగి రావడానికి విమానంలో ఎక్కిన ఆయన.. మరో రెండు సుదీర్ఘ సమావేశాల్లో పాలుపంచుకున్నారు. ఈ సమావేశాల్లో మొత్తం అమెరికా పర్యటనలోని కీలక అంశాలు, ఈ టూర్ వల్ల కలిగిన ప్రయోజనాలపై చర్చించారు. గత కొన్ని రోజులుగా తీరిక లేకుండా పాల్గొన్న సమావేశాలు ఫలప్రదం అయ్యాయని ఇండియాకు బయలు దేరే ముందు మోదీ ట్వీట్ చేశారు.