న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ యూజర్లకు గుడ్న్యూస్. దేశంలోకి 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సేవల్ని ప్రారంభించారు. రానున్న కొన్ని సంవత్సరాల్లో ఈ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగిన ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఆరవ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ను కూడా ప్రధాని ప్రారంభించారు. అయితే దివాళీ నుంచి యూజర్లు 5జీ సేవలను ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఎయిర్టెల్, రిలయన్స్ జియో, క్వాల్కమ్ కంపెనీలు తమ 5జీ సేవల గురించి ప్రధాని మోదీకి వివరించాయి. ఆకాశ్ అంబానీ 5జీ గురించి ప్రధానికి డెమో ఇచ్చారు.
టెలికాం చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. డిజిటల్ ఇండియాకు ఇది ఫౌండేషన్గా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరికీ డిజిటల్ సేవల్ని చేరవేయడంలో 5జీ ఉపకరిస్తుందని మంత్రి వైష్ణవ్ వెల్లడించారు.
5జీ సేవలను ప్రారంభించడం పట్ల గర్వంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తెలిపారు. టెలికాం రంగంలో నాయకత్వ పాత్రను పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక నుంచి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ .. ఆసియా మొబైల్ కాంగ్రెస్ కావాలని, అదే గ్లోబల్ మొబైల్ కాంగ్రెస్గా అవతరలించాలని ముఖేశ్ వెల్లడించారు. నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ కన్నా 5జీ ఎంతో కీలకమైందన్నారు. 21వ శతాబ్ధంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్, రోబోటిక్స్, బ్లాక్చెయిన్, మెటా వర్స్ లాంటి టెక్నాలజీలకు 5జీ టెక్నాలజీ ఏమాత్రం తీసిపోదన్నారు.
ఇవాళ అతి ముఖ్యమైన రోజు అని భారతి సంస్థ చైర్మన్ సునిల్ భారతి మిట్టల్ తెలిపారు. ఓ కొత్త యుగం ప్రారంభంకానున్నదని, 75వ స్వాతంత్ర దినోత్సవ వేళ ఇది జరగడం శుభదాయకమని, 5జీతో ప్రజలకు అనేక కొత్త అవకాశాలు వస్తాయని సునిల్ మిట్టల్ తెలిపారు.