న్యూఢిల్లీ : రక్షణ రంగంలో ఎదురయ్యే సవాళ్లు, సాయుధ దళాల ఆధునీకరణపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో మంగళవారం సమావేశమయ్యారు. జమ్ము కశ్మీర్లో డ్రోన్ దాడుల ముప్పు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
లడఖ్లో రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ రెండు రోజుల పర్యటన ముగిసిన మరుసటి రోజు ఈ సమావేశం జరగడం గమనార్హం. జమ్ము ఎయిర్ ఫోర్స్ స్టేషన్పై ఆదివారం జరిగిన డ్రోన్ దాడి ఘటన నేపథ్యంలో భద్రతా అంశాలపై సమీక్ష జరగనుంది. కాగా, డ్రోన్ దాడి వెనుక పాకిస్తాన్కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయిబా హస్తం ఉందని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు లడఖ్ పర్యటన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ డ్రాగన్కు హెచ్చరికలు పంపారు. భారత్ శాంతికాముక దేశమని, అయితే తమను బెదిరించాలని చూస్తే సహించబోమని చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.