న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా ఫిరోజ్పూర్లో రోడ్డు మార్గాన వెళ్తుండగా భద్రతాలోపం తలెత్తిన ఘటనపై ఇక స్వతంత్ర కమిటీ దర్యాప్తు చేపట్టనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. పంజాబ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక స్వతంత్ర కమిటీని వేసేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.
అయితే, ఇప్పటికే ప్రధాని భద్రతాలోపంపై కేంద్ర కమిటీ దర్యాప్తు చేస్తున్నది. కేంద్ర కమిటీ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని తమకు నమ్మకం లేదని, రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నదని పంజాబ్ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తంచేసింది. ఇప్పటికే పంజాబ్ అధికారులను దోషులుగా చిత్రీకరిస్తూ 7 షోకాజ్ నోటీసులు ఇచ్చిందని పంజాబ్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
ఈ క్రమంలో ఘటనపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిటీని నియమించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. స్వతంత్ర కమిటీ దర్యాప్తులో దోషులుగా తేలితే నన్ను, నా అధికారులను ఉరితీయండని పంజాబ్ ఏజీ వాదించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని మందలించింది. కొందరిని దోషులుగా చిత్రించి, చర్యలు తీసుకుంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత తాము విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ కేంద్ర తరఫున వాదనలు వినిపించారు.
ప్రధాని భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఎస్పీజీ చట్టం ప్రకారం సంబంధిత అధికారులను ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందని సొలిసిటర్ జనరల్ వాదించారు. ప్రధాని పర్యటన ముందుగానే ఖరారైందని, వాతావరణ పరిస్థితుల దృష్ట్యానే రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారని, దీనిపై రాష్ట్ర ఏజన్సీలకు ముందుగానే సమాచారం ఇచ్చారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రధాని వాహనశ్రేణికి ముందున్న సెక్యూరిటీ వాహనం 100 మీటర్ల సమీపానికి వచ్చేవరకు పంజాబ్ అధికారులు రోడ్డు క్లియర్గా ఉందని తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన ఆరోపించారు.
స్వతంత్ర కమిటీలో సభ్యులు..
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీచేసింది. స్వతంత్ర కమిటీలో చండీగఢ్ డీజీపీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐజీ, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ ADGP (సెక్యూరిటీ)లను సుప్రీంకోర్టు సభ్యులుగా చేర్చింది. అయితే, ఘటనపై ఇప్పటికే కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలు వేసిన కమిటీలు విచారణ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.